Begin typing your search above and press return to search.

అజిత్ ఫ్యాన్స్ గాలి తీసేశాడు

By:  Tupaki Desk   |   25 Nov 2015 6:43 AM GMT
అజిత్ ఫ్యాన్స్ గాలి తీసేశాడు
X
మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అంటూ స్టార్ హీరోల అభిమానులు కొట్టుకోవడం ఏ ఇండస్ట్రీలో అయినా ఉండేదే. కానీ తమిళనాట ఈ జాఢ్యం బాగా ఎక్కువ. అందులోనూ విజయ్ - అజిత్ అభిమానుల మధ్య ఈ గొడవలు తీవ్ర స్థాయిలో ఉంటాయి. తమ హీరో సినిమా హిట్టయితే విర్రవీగడం.. అవతలి హీరో సినిమా ఫ్లాప్ అయితే గేలి చేయడం.. చాలా తీవ్ర స్థాయిలో ఉంటుంది. ఆ మధ్య ‘పులి’ సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యేసరికి అజిత్ అభిమానుల ఆనందానికి అవధుల్లేవు. ఇంతలో అజిత్ సినిమా ‘వేదాలం’ హిట్టయ్యేసరికి వాళ్ల ఆనందం డబుల్ అయింది. తమ హీరో సినిమా వారం రోజుల్లోనే వంద కోట్ల కలెక్షన్లు కొల్లగొట్టిందని చెప్పుకుంటూ సంబరాలు చేసుకున్నారు అజిత్ ఫ్యాన్స్. అదే సమయంలో విజయ్ అభిమానుల్ని వెక్కిరించడం మొదలుపెట్టారు.

ఐతే అజిత్ అభిమానుల గాలి తీసేస్తూ ‘వేదాలం’ నిర్మాత ఎ.ఎం.రత్నం ఒక షాకింగ్ స్టేట్ మెంట్ ఇచ్చారు నిన్న రాత్రి.. వేదాలం సినిమా విషయంలో 100 కోట్లు-200 కోట్లు అని లెక్కలు చెబుతున్నారని.. అదంతా శుద్ధ అబద్ధమని.. బాక్సాఫీస్ లెక్కల గురించి, అందులోని స్టేక్ హోల్డర్ల వాటాల గురించి తెలియని వాళ్లే ఇలా మాట్లాడతారని.. తమ సినిమా వంద కోట్ల కలెక్షన్లు సాధించిందనడం వాస్తవం కాదని అన్నారు రత్నం. ‘వేదాలం’ మంచి కలెక్షన్లు సాధిస్తున్న మాట వాస్తవమని.. ఐతే వర్షాల వల్ల వసూళ్లు తగ్గాయని ఆయన అన్నారు. ‘ఇండియన్’ సినిమా దగ్గర్నుంచి తాను కలెక్షన్ల గురించి మాట్లాడ్డం మానేశానని.. కాబట్టి ‘వేదాలం’ ఎంత వసూలు చేసిందో తాను చెప్పలేనని... తమిళ ఇండస్ట్రీలో కలెక్షన్ల గురించి పారదర్శకంగా వెల్లడించే పరిస్థితి లేదని కూడా ఆయన కుండబద్దలు కొట్టేశారు. నిజానికి కలెక్షన్ల లెక్కల్ని అతిగా చూపించే జాఢ్యం తమిళనాట బాగా ఎక్కువే. మనం షేర్ (ట్యాక్స్ - థియేటర్ల రెంట్లు పోను డిస్ట్రిబ్యూటర్ కి మిగిలేది) గురించి మాట్లాడితే వాళ్లు గ్రాస్ వసూళ్ల గురించే మాట్లాడి గొప్పలు చెప్పుకుంటారు. రత్నం ఈ విషయంలో వాస్తవాలు మాట్లాడి అజిత్ ఫ్యాన్స్ కి మాత్రమే కాదు.. మొత్తంగా తమిళ అభిమానుల గాలి తీసేశాడు.