Begin typing your search above and press return to search.

సర్కార్‌ తరహాలోనే '2.ఓ'.. నిర్మాతల్లో టెన్షన్‌!

By:  Tupaki Desk   |   10 Nov 2018 7:25 AM GMT
సర్కార్‌ తరహాలోనే 2.ఓ.. నిర్మాతల్లో టెన్షన్‌!
X
తమిళం - తెలుగు - హిందీ ఇలా అన్ని భాషల సినిమాలను ప్రస్తుతం పైరసీ బూతం పట్టి పీడిస్తోంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా - ఎంతగా పైరసీని అడ్డుకునేందుకు ఎన్ని రకాలుగా ప్రయత్నించినా కూడా ఫలితం ఉండటం లేదు. కోలీవుడ్‌ నిర్మాతల మండలికి విశాల్‌ అధ్యక్షుడు అయిన తర్వాత పైరసీపై పెద్ద యుద్దమే చేస్తున్నారు. ముఖ్యంగా తమిళ రాకర్స్‌ పెద్ద సినిమాలను విడుదలైన కొన్ని గంటల్లోనే పైరసీ చేసి ఆన్‌ లైన్‌ లో పెడుతున్నారు. విశాల్‌ పైరసీ పై యుద్దం చేస్తున్న ఈ సమయంలో వారు మరింతగా రెచ్చి పోతున్నారు.

ఇటీవలే విడుదలైన విజయ్‌ - మురుగదాస్‌ ల సర్కార్‌ చిత్రం మొదటి షో పూర్తి అవ్వకుండానే సినిమాను ఆన్‌ లైన్‌ లో ఉంచారు. హెచ్‌ డీ ప్రింట్‌ తో సినిమాను పైరసీ చేస్తామని నిర్మాతలను హెచ్చరించినట్లుగానే తమిళ రాకర్స్‌ చేశారు. హెడ్‌ డీ ప్రింట్‌ మార్నింగ్‌ షో కే రావడంతో సినిమాకు భారీ నష్టం జరిగింది. ఇప్పుడు ‘2.ఓ’ చిత్రానికి కూడా తమిళ రాకర్స్‌ హెచ్చరికలు చేశారు. చిత్రం విడుదలైన మొదటి రోజు - మొదటి షో పూర్తి అయ్యే సమయానికి పైరసీ ఆన్‌ లైన్‌ లోకి వచ్చేస్తుందని ట్విట్టర్‌ ద్వారా పేర్కొన్నారు.

దాదాపు 550 కోట్ల బడ్జెట్‌ తో శంకర్‌ దర్శకత్వంలో విజువల్‌ వండర్‌ గా తెరకెక్కిన ‘2.ఓ’ చిత్రం పైరసీ అయితే పెద్ద ఎత్తున నష్టాలు చవి చూడాల్సి వస్తుందనే ఆందోళనలో నిర్మాతలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఒకవేళ అదే జరిగితే 2.ఓ చిత్ర డిస్ట్రిబ్యూటర్ల లాస్‌ భారీగా ఉంటుంది. సినిమా సక్సెస్‌ అయినా కూడా ఆశించిన స్థాయిలో వసూళ్లు రావేమో అంటూ ఆందోళన వ్యక్తం అవుతుంది.

మరో వైపు ‘2.ఓ’ చిత్రం మొబైల్‌ తెరపై కంటే వెండి తెరపై చూస్తేనే బాగుంటుంది - పైరసీ చూస్తే ‘2.ఓ’లోని విజువల్స్‌ ను ఎంజాయ్‌ చేయలేరు అంటూ చిత్ర యూనిట్‌ సభ్యులు ప్రచారం చేస్తున్నారు. మొత్తానికి నిర్మాతలను - సినిమా పరిశ్రమనే తమిళ రాకర్స్‌ ఒణికిస్తున్నారు.