Begin typing your search above and press return to search.

చిరు క్లాప్‌ - దర్శ‌కేంద్రుడి అక్షింత‌లు

By:  Tupaki Desk   |   11 Nov 2018 8:21 AM GMT
చిరు క్లాప్‌ - దర్శ‌కేంద్రుడి అక్షింత‌లు
X
రాజ‌మౌళి- రామారావు - రామ్‌ చ‌ర‌ణ్‌ కాంబినేష‌న్‌లో డివివి ఎంట‌ర్‌ టైన్‌ మెంట్స్ సంస్థ నిర్మిస్తున్న RRR మాస్సివ్ లాంచ్ అత్యంత గ్రాండ్‌ గా సాగింది. హైద‌రాబాద్ అల్యూమినియం ఫ్యాక్ట‌రీలో జ‌రిగిన ఈ ఈవెంట్‌ కి ముఖ్య అతిధిగా బాహుబ‌లి ప్ర‌భాస్ - మెగాస్టార్ చిరంజీవి విచ్చేశారు. ద‌ర్శ‌కేంద్రుడు కే.రాఘ‌వేంద్ర‌రావు జ‌క్క‌న్న & టీమ్‌ కి స్క్రిప్టు ప్ర‌తుల్ని అందించి ఆశీర్వదించారు. ఈ వేడుక‌లో అల్లు అర‌వింద్ - చ‌ర‌ణ్‌ - ఎన్టీఆర్ - రానా - వి.వి.వినాయ‌క్‌ - ఎం.ఎం.కీర‌వాణి - బుర్రా సాయిమాధ‌వ్ త‌దిత‌రులు పాల్గొన్నారు. అయితే బాహుబ‌లి చిత్ర‌బృందం అంతా పాల్గొంటార‌ని భావిస్తే, కేవ‌లం నిర్మాత శోభు యార్ల‌గ‌డ్డ మాత్ర‌మే క‌నిపించారు.

దాదాపు 300కోట్ల బడ్జెట్‌ తో డీవీవీ ఎంట‌ర్‌ టైన్‌ మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని తెర‌కెక్కించ‌నుంది. నేటి నుంచే అల్యూమినియం ఫ్యాక్ట‌రీ వ‌ద్ద వేసిన సెట్స్‌ లో రెగ్యుల‌ర్ చిత్రీక‌ర‌ణ కొన‌సాగ‌నుంది. 2020లో రిలీజ్ ల‌క్ష్యంగా ప్ర‌ణాళిక‌ను రాజ‌మౌళి టీమ్ సిద్ధం చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే ఆర్ ఆర్ ఆర్ మాసివ్ లాంచ్ అన్న‌ ప్ర‌చారార్భాటం చూసి ఫ‌క్తు మాస్‌ గా చ‌ర‌ణ్ - ఎన్టీఆర్ అభిమానుల స‌మ‌క్షంలో ఘ‌నంగా ఉంటుందేమో అనుకున్నారంతా. భారీ ఎత్తున అభిమానులు - మీడియా బెటాలియ‌న్ దిగుతార‌నే అంతా అనుకున్నారు. కానీ వీళ్ల‌కు ఏమాత్రం అవ‌కాశం క‌ల్పించ‌కుండా డివివి సంస్థ నిరాశ‌ప‌రిచ‌డంపై ఫిలిం మీడియాలో చ‌ర్చ సాగుతోంది. ఒక డీసెంట్ ఎఫైర్‌ గా ఎలాంటి గ‌డ‌బిడ లేకుండా ఈ ఈవెంట్‌ ని చేయాల‌నుకున్నారా? అంటూ సందేహం వ్య‌క్తం అవుతోంది.

ఈవెంట్ ఫోటోల్ని డివివి ఎంట‌ర్‌ టైన్‌ మెంట్స్ సంస్థ అధికారిక ట్విట్ట‌ర్‌ లో అభిమానుల‌కు షేర్ చేసింది. ఈ ఈవెంట్‌ లో చ‌ర‌ణ్ స్వామి అయ్య‌ప్ప మాల‌ధార‌ణ‌లో క‌నిపించారు. తార‌క్ ఫార్మ‌ల్ లుక్‌ లో క‌నిపించ‌గా - జ‌క్క‌న్న య‌థావిధిగా బులుగు చొక్కాలో చాలా సింపుల్‌ గా విచ్చేశారు.