Begin typing your search above and press return to search.

పూర్వీకులు తిన్న ఆహారంతోనే నేటి తరానికి జబ్బులు!

By:  Tupaki Desk   |   12 July 2015 2:41 AM GMT
పూర్వీకులు తిన్న ఆహారంతోనే నేటి తరానికి జబ్బులు!
X
మధుమేహం.. స్థూలకాయం.. వంటి వాటిని జబ్బులుగా గాక.. లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ గా తేల్చేశారు వైద్యులు. ఇవి అత్యంత సహజం అన్నట్టుగా మారిపోయింది వ్యవహారం. మరి ఈ వ్యాధులకు కారణం మనుషుల జీవనశైలే అని చెబుతూ వచ్చారు. శారీరక వ్యాయామం లేకపోవడం.. ఇతర కారణాల వల్ల ఈ జబ్బుల బారిన ఎక్కుమంది పడుతున్నారని విశ్లేషిస్తూ వచ్చారు. అయితే ఈ జబ్బులకు కారణం కేవలం వ్యక్తిగత జీవనశైలే కాదని తేల్చాయి తాజా పరిశోధనలు!

మనం అడ్డదిడ్డంగా తినేయడం.. ఎలాంటి శారీరక శ్రమ చేయకపోవడం.. వంటి కారణాల రీత్యా మాత్రమే కాకుండా.. పూర్వీకుల ప్రభావం చేత కూడా ఇలాంటి జబ్బులు సోకుతున్నాయని వైద్య పరిశోధకులు తేల్చారు. ఒక్కమాటలో చెప్పాలంటే.. ఈ తరం వారు మధుమేహం, స్థూలకాయంతో బాధపడుతున్నారంటే.. దానికి కారణం గత తరం ఆహారపు అలవాట్లేనని వీరు అంటున్నారు. ఆ తరంలో సరైన పౌష్టికాహరం తీసుకోకపోవడం వల్ల నేటి తరం వారిపై అది దుష్ప్రభావంగా మారిందని ఈ థియరీ చెబుతోంది.

మరి దీన్ని బట్టి.. నేటి లైఫ్ స్టైల్ పుణ్యం అనుకొంటున్న జబ్బులకు దోషులుగా ముందు తరాల వారిని నిందిచాల్సి వస్తోంది. వారి వల్లనే.. నాటి పరిస్థితుల వల్లనే నేడు అనేక మంది జబ్బుల బారిన పడుతున్నారని అనుకోవాల్సి వస్తోంది. అంతే కాదు.. పరిశోధకులు ఇంకో విషయం కూడా చెప్పారు. ఈ తరం వారు పౌష్టికాహారం తీసుకొంటే.. వచ్చే తరం వారిపై అది రక్షణకవచంలా పనిచేస్తుందని కూడా వారు వివరించారు. కాబట్టి.. భావితరాల ఆరోగ్యాన్ని కాపాడటానికి.. నేటి తరం వారు పౌష్టికాహారాన్ని తీసుకోవాలేమో! ఈ రకంగా భవిష్యత్ తరాలను కాపాడాలేమో!