Begin typing your search above and press return to search.

హాట్ టాపిక్... టీడీపీ అభ్యర్థులకే కాన్ఫిడెన్స్ కొరవడుతుందా?

పైగా... ఈ సిద్ధం సభలతో పాటు.. మేమంతా సిద్ధం బస్సు యాత్రల్లోనూ జగన్ ప్రజలకు చెప్పాలనుకున్న విషయాన్ని వీలైనంత సూటిగా, స్పష్టంగా చెప్పారనే చర్చ ఇప్పుడు తెరపైకి వచ్చింది.

By:  Tupaki Desk   |   25 April 2024 7:44 AM GMT
హాట్  టాపిక్... టీడీపీ అభ్యర్థులకే కాన్ఫిడెన్స్  కొరవడుతుందా?
X

ఏపీలో ఎన్నికల వేళ ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. 2019 ఎన్నికల సమయంలో పాదయాత్ర అంటూ నెలల పాటు ప్రజలతోనే ఉన్న వైఎస్ జగన్... ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలోనూ 2024 ఎన్నికల ముందు సుమారు నెల రోజుల పాటు సిద్ధం, మేమంతా సిద్ధం అంటూ ప్రజల్లో ఉన్నారు. ఈ సమయంలో టీడీపీ అభ్యర్థుల్లో కాన్ఫిడెన్స్ కొరవడుతుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. పైగా ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి చేసిన వ్యాఖ్యలంటూ "ఇండియన్ ఎక్స్ ప్రెస్" లో వచ్చిన వార్త ఇప్పుడు వైరల్ గా మారుతుంది!


అవును... ఏపీ రాజకీయాలపై "సిద్ధం" సభలకు ముందు వరకూ కాస్త మిక్స్డ్ అనాలసిస్ లు, మిక్స్డ్ సర్వే ఫలితాలు, మిక్స్డ్ చర్చలు జరుగుతుండేవి కానీ... ఎప్పుడైతే "సిద్ధం" అంటూ జగన్ కార్యకర్తలతో బహిరంగ సభలు నిర్వహించారో.. నాటి నుంచి లెక్కలు మారడం మొదలైందని అంటున్నారు. ఇదే సమయంలో... "మేమంతా సిద్ధం" అంటూ బస్సుయాత్రతో అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల ప్రజలతోనూ మమేకమవ్వుతూ తిరగడం మరింతగా వారికి ప్లస్ అయ్యిందని చెబుతున్నారు.

అందువల్లే ఈ ఏడాది ప్రారంభంలోని సర్వేల ఫలితాలు, విశ్లేషకుల అభిప్రాయాలు ఒకలా ఉంటే... అభ్యర్థుల ప్రకటన, సిద్ధం యాత్రలు, మేమంతా సిద్ధం బస్సు యాత్ర సమయంలో సర్వే ఫలితాలతో పాటు, విశ్లేషకుల అభిప్రాయాలు, ప్రజల మనసుల్లో ఉన్న అభిప్రాయాలు స్పష్టంగా తెరపైకి వచ్చయనే మాటలు వినిపిస్తున్నాయి. దీంతో... వైసీపీ అభ్యర్థుల్లో సరికొత్త ఉత్సాహం వచ్చిందని అంటున్నారు.

పైగా... ఈ సిద్ధం సభలతో పాటు.. మేమంతా సిద్ధం బస్సు యాత్రల్లోనూ జగన్ ప్రజలకు చెప్పాలనుకున్న విషయాన్ని వీలైనంత సూటిగా, స్పష్టంగా చెప్పారనే చర్చ ఇప్పుడు తెరపైకి వచ్చింది. ఇందులో ప్రధానంగా... ఈ ప్రభుత్వ హయాంలో మీకు, మీ ఇంటికీ మేలు జరిగితేనే వైసీపీ ఓటు వేయండి అనేది ఒకటి కాగా... 2014లో ఇదే కూటమి ఇచ్చిన హామీలో ఎన్ని హామీలు నెరవేరాయో, నాడు వారు చెప్పిన మాటల్లో ఎన్ని జరిగాయో ఒక్కసారి ఆలోచించాలని కోరుతున్నారు.

దీంతో... సాధారణంగా ఉండే ప్రభుత్వ వ్యతిరేక ఓటు పలచబడిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. పైగా పవన్ కల్యాణ్ పై ఎన్నో ఆశలు పెట్టుకున్న వర్గం.. ఆయన తీసుకున్న నిర్ణయాలు, చేసిన వ్యాఖ్యలతో తీవ్ర అసంతృప్తిగా ఉందని చెబుతున్నారు. ఇదే సమయంలో... ఇంతకాలం పార్టీకి పనిచేసిన తమకు కాకుండా పక్క పార్టీల నుంచి వచ్చిన వలస పక్షులకు టిక్కెట్లు ఇచ్చారనే ఆవేదన, ఆక్రోశం బీజేపీ కేడర్ లో బలంగా ఉందని చెబుతున్నారు.

మరోపక్క... ఇదే కూటమి వల్ల టిక్కెట్లు పోగొట్టుకున్న టీడీపీ నేతలతో పాటు.. టిక్కెట్ ఇస్తానని చెప్పి చివర్లో ఎగ్గొట్టబడినవారు కూడా టీడీపీపై దుమ్మెత్తి పోస్తున్నారని చెబుతున్నారు. ఇన్ని ఇంటర్నల్ సమస్యల నడుమ... టీడీపీ నేతల్లో కాన్ ఫిడెన్స్ లెవల్స్ తగ్గుతున్నాయనే చర్చ తెరపైకి వచ్చింది. తాజాగా నరసరావుపేట టీడీపీ ఎంపీ అభ్యర్థి చేసినట్లు చెబుతున్న వ్యాఖ్యలు ఇందుకు తాజా సాక్ష్యం అనే కామెంట్లూ వినిపిస్తున్నాయి.

తాజాగా "ఇండియన్ ఎక్స్ ప్రెస్" మీడియాలో వచ్చిన కథనం ప్రకారం... నరసరావు పేట టీడీపీ ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయులు ఆ మీడియాతో మాట్లాడుతూ... "రాష్ట్రంలో ఈ ఎన్నికల్లో టీడీపీ గెలవాలి అంటే చాలా కష్టపడాలి.. ఎన్డీయే కూటమిలో కలిసినా అంతగా మేలు అయితే ఏమి జరగలేదు.." అని వ్యాఖ్యానించారని తెలుస్తోంది! ఈ విషయాన్ని సదరు మీడియా స్పష్టంగా వెల్లడించింది!

దీంతో... ఈ విషయాన్ని వైసీపీ కార్యకర్తలు, అభిమానులు విపరీతంగా షేర్ చేస్తున్నారు. "టీడీపీ నేతలే గెలుపుపై పూర్తి ధీమాగా, నమ్మకంగా చెప్పలేకపోతున్నారని.. టీడీపీ నేతల మాటలే చెబుతున్నాయి, పెరిగిన వైసీపీ గ్రాఫ్ గురించని” చెబుతూ... ఈ విషయన్ని వైరల్ చేస్తున్నారు. దీంతో... ఈ వ్యవహారం ఏపీ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశం అవుతోంది!