Begin typing your search above and press return to search.

కలిశెట్టికి ఎంపీ సీటు...గెలుపు గుర్రమేనా...!?

టికెట్ అయితే దక్కింది. ఆ మీదట నెగ్గడం అన్నది కలిశెట్టి చేతిలో చేతలలో ఉంది. ఇదిలా ఉంటే ఎచ్చెర్ల నియోజకవర్గం అసెంబ్లీ టికెట్ ని కలిశెట్టి ఆశించారు.

By:  Tupaki Desk   |   30 March 2024 3:44 AM GMT
కలిశెట్టికి ఎంపీ సీటు...గెలుపు గుర్రమేనా...!?
X

తెలుగుదేశం పార్టీ శిక్షణా శిబిరానికి అధ్యాపకుడిగా మారి ఎందరికో స్పూర్తివంతమైన పాఠాలు చెబుతూ టీడీపీ శ్రేయస్సు కోసం సదా పాటు పడుతూ దశాబ్దాలుగా ఆ పార్టీతో నడుస్తూ వస్తున్న సీనియర్ నేత కలిశెట్టి అప్పలనాయుడుకు చంద్రబాబు డబుల్ ప్రమోషన్ ఇచ్చేశారు. ఆయన జస్ట్ ఎమ్మెల్యే టికెట్ కోరుకుంటే ఆయనకు ఢిల్లీ పార్లమెంట్ కి వెళ్లే దారిని చూపించారు.


టికెట్ అయితే దక్కింది. ఆ మీదట నెగ్గడం అన్నది కలిశెట్టి చేతిలో చేతలలో ఉంది. ఇదిలా ఉంటే ఎచ్చెర్ల నియోజకవర్గం అసెంబ్లీ టికెట్ ని కలిశెట్టి ఆశించారు. ఆ సీటు చుట్టూనే ఆయన గత అయిదేళ్ళుగా తన రాజకీయాన్ని అల్లుకున్నారు. కానీ టీడీపీ అధినాయకత్వం అనూహ్య నిర్ణయం తీసుకుంది.

కలిశెట్టికి విజయనగరం ఎంపీ సీటుని కట్టబెట్టింది. ఏకంగా ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల మీద గెలవాలని బిగ్ టాస్క్ ని ఇచ్చింది. దీంతో కలిశెట్టికి ఇది చాలెంజ్ గా మారుతోంది. ఆయనకు ఎచ్చెర్ల అసెంబ్లీ టికెట్ ఇచ్చి మాజీ మంత్రి కిమిడి కళా వెంకట్రావు కి విజయనగరం ఎంపీ సీటు ఇచ్చి ఉంటే ఇద్దరికీ న్యాయం జరిగేదని అంతా అనుకున్నారు.

అసలు అలాగే చేస్తారు అని ప్రచారం కూడా సాగింది. కానీ అనూహ్యంగా ఇపుడు ఎచ్చెర్ల సీటుని బీజేపీకి ఇచ్చేశారు. కేవలం వేయి ఓట్లు మాత్రమే 2019 ఎన్నికల్లో వచ్చిన బీజేపీకి ఎచ్చెర్ల సీటు ఇచ్చేసి బలవంతులు అయిన ఇద్దరు నేతలను చేరో సీటుకు సర్దేసింది టీడీపీ అధినాయకత్వం.

దీని వల్ల చీపురుపల్లి అసెంబ్లీ టికెట్ కళా వెంకట్రావు కి వెళ్ళింది. విజయనగరం ఎంపీ సీటు కలిశెట్టి పరం అయింది. నిజానికి ఈ సీట్ల పంపిణీతో ఈ ఇద్దరూ అంత సంతృప్తిగా లేరు అని అంటున్నారు. మంత్రి బొత్స మీద చివరి నిముషంలో ఫైట్ చేయడం అంటే కళా వెంకట్రావు కి కూడా టఫ్ జాగ్ గానే ఉంటుంది. పైగా అక్కడ లోకల్ గా ఉన్న అసంతృప్తులు కూడా సర్దుబాటు చేసుకోవాలి.

దాని కంటే ఎంపీ సీటే నయం అని కళా వర్గం అంటోంది. తమ నేత అనుభవానికి పార్లమెంట్ కి పంపినా ఓకే అని వారు అంటున్నారు. అయితే విజయనగరం కీలక నేత కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు కలిశెట్టి వైపే మొగ్గు చూపారు అని అంటున్నారు.

దాంతో కళాకు చీపురుపల్లి వెళ్ళక తప్పలేదు అని అంటున్నారు. ఇక ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలలో మెజారిటీ చోట్ల వైసీపీ బలంగా ఉంది. ఉత్తరాంధ్రాలో వైసీపీ గెలిచే తొలి ఎంపీ సీటు అరకు అయితే మలి ఎంపీ సీటు విజయనగరం అని సర్వేలు పక్కన పెట్టి చెప్పే పరిస్థితి ఉంది. అలాంటి చోట కలిశెట్టి ఎంపీగా గెలవాలీ అంటే చాలానే కష్టపడాలి అని అంటున్నారు.

ఆయనకు అశోక్ దీవెనకు ఉంటే కనుక ఈ టఫ్ టాస్క్ ని ఎంతో కొంత సునాయాసం చేసుకోగలరు అని అంటున్నారు. ఏది ఏమైనా కలిశెట్టికి ఈసారి టికెట్ దక్కడం అది కూడా ఎంపీగా చాన్స్ రావడం పట్ల ఆయన వర్గంలో అయితే ఆనందం కనిపిస్తోంది.ఇక జయాపజయాలు జనాలే నిర్ణయిస్తారు అని అంటున్నారు.