Begin typing your search above and press return to search.

సిద్ధార్థ్‌, అదితి పెళ్ళి - ట్విస్ట్ ఇచ్చిన లవ్ బర్డ్స్!

హీరో సిద్ధార్థ్‌, హీరోయిన్ అదితిరావ్‌ హైదరీ వివాహ బంధంలోకి అడుగుపెట్టినట్టు నిన్నటి నుంచి వార్తలు వైరల్ అవుతున్నాయి.

By:  Tupaki Desk   |   28 March 2024 11:14 AM GMT
సిద్ధార్థ్‌, అదితి పెళ్ళి - ట్విస్ట్ ఇచ్చిన లవ్ బర్డ్స్!
X

హీరో సిద్ధార్థ్‌, హీరోయిన్ అదితిరావ్‌ హైదరీ వివాహ బంధంలోకి అడుగుపెట్టినట్టు నిన్నటి నుంచి వార్తలు వైరల్ అవుతున్నాయి. గత కొన్నేళ్లుగా డేటింగ్ లో ఉన్న ఈ జంట.. వనపర్తి జిల్లా శ్రీరంగాపురంలోని రంగనాథస్వామి ఆలయంలో పెళ్ళి చేసుకున్నట్లు కథనాలు వచ్చాయి. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకూ ఇదే హాట్ టాపిక్ గా మారింది. అధికారిక ప్రకటన కోసం అందరూ వేచి చూస్తున్న తరుణంలో.. తాము ఇంకా పెళ్ళి చేసుకోలేదని, నిశ్చితార్థం మాత్రమే జరిగిందని తాజాగా ట్విస్ట్ ఇచ్చారు.


పెళ్ళి వార్తలు చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో సిద్దార్థ్ సూర్యనారాయణన్ ఇన్స్టాగ్రామ్ లో ఓ పోస్ట్ పెట్టారు. 'ఆమె ఎస్ చెప్పింది.. ఎంగేజ్డ్' అంటూ ఓ రీల్ షేర్ చేశారు. నిశ్చితార్థం అయినట్లుగా అదితి రావ్‌ హైదరీతో కలిసి ఉంగరాలు చూపిస్తున్న ఓ ఫోటోని పంచుకున్నారు. మరోవైపు అదితి సైతం అదే వీడియోని సోషల్ మీడియాలో పంచుకుంది. 'అతను ఎస్ చెప్పాడు' అంటూ ఎంగేజ్ మెంట్ జరిగిందనే విషయాన్ని వెల్లడించింది.

సిద్ధార్థ్‌, అదితి రావ్‌ మూడు ముళ్ల బంధంలో అడుగుపెట్టారని అందరూ అనుకుంటున్న సమయంలో, ఎంగేజ్మెంట్ అయిందని పోస్ట్ పెట్టి లవ్ బర్డ్స్ అందరికీ షాక్ ఇచ్చారు. దీంతో బుధవారం ఉదయం శ్రీరంగాపురం రంగనాథస్వామి ఆలయంలో జరిగింది పెళ్ళి కాదు, నిశ్చితార్థ కార్యక్రమం అని క్లారిటీ వచ్చేసింది. ఈ వేడుకకు ఇరు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హజరైనట్లు తెలుస్తోంది.

అయితే సిద్ధార్థ్‌, అదితిల నిశ్చితార్థం సందర్భంగా శ్రీరంగాపురం గ్రామస్థులను, మీడియాను ఆలయంలోకి అనుమతించలేదట. ఏదో సినిమా షూటింగ్ జరుగుతోంది అని చెప్పి, ఇతరులు ఎవ్వరినీ లోపలికి రానివ్వలేదనే టాక్ కూడా వినిపిస్తోంది. తమిళనాడు నుంచి వచ్చిన పూజారుల చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలుస్తోంది. దీనికి వనపర్తి సంస్థానాధీశుల వారసుడు రాజా కృష్ణదేవరావు, ఆయన కుటుంబ సభ్యులు హాజరయ్యారని సమాచారం.

అదితిరావ్‌ హైదరీ తల్లితండ్రులు తెలంగాణా ప్రాంతానికి చెందినవారు. వనపర్తి సంస్థానాధీశుల ఆఖరి రాజు రామేశ్వరరావుకు ఆమె మనువరాలు అవుతుంది. ప్రస్తుతం ఉన్న రాజా కృష్ణదేవరావుకు మేనకోడలు. 18వ శతాబ్దానికి చెందిన రంగనాథస్వామి గుడితో వీళ్లకు ఎంతో అనుబంధం ఉంది. అందుకే అదితి - సిద్దార్థ్ నిశ్చితార్థం చేసుకున్నానని అంటున్నారు. ఎంగేజ్మెంట్ అనంతరం వనపర్తిలోని సంస్థానాధీశుల వాసుదేవమ్మ తోటలో విందు జరిగిందని వార్తలు వస్తున్నాయి.

అదితి రావుకు ఇదివరకే పెళ్లయింది. 21 ఏళ్ల వయసులో సత్యదీప్ మిశ్రా అనే బాలీవుడ్ నటుడిని వివాహమాడి ఒక బాబుకు జన్మనిచ్చింది. అయితే ఆమె వైవాహిక జీవితం సాఫీగా సాగలేదు. దీంతో 2012లో విడాకులు తీసుకుంది. అప్పట్నుంచి సింగిల్ గానే ఉంటూ, కెరీర్ మీద ఫోకస్ పెట్టింది. 2021లో అజయ్ భూపతి తెరకెక్కించిన 'మహా సముద్రం' సినిమా టైమ్ లో సిద్దార్థ్ తో ఆమెకు పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారడంతో ఇద్దరూ సహజీవనం కొనసాగించారు.

అయితే సిద్ధార్థ్‌, అదితిలు తమ సంబంధాన్ని అధికారికంగా ప్రకటించనప్పటికీ, ఇద్దరూ తమ అనుబంధాన్ని దాచే ప్రయత్నం చేయలేదు. చెట్టాపట్టాలేసుకొని ముంబై వీధుల్లో చక్కర్లు కొట్టడమే కాదు, ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో వీరిద్దరూ హీరో శర్వానంద్ నిశ్చితార్థానికి కూడా జంటగా హాజరయ్యారు. ఇన్నాళ్లకు ఎంగేజ్మెంట్ చేసుకొని తమ బంధాన్ని అఫిషయల్ గా ప్రకటించారు.

ఇకపోతే బొమ్మరిల్లు సిద్దార్థ్ కు ఆల్రెడీ పెళ్లయింది. గతంలో మేఘనా అనే అమ్మాయితో ఏడడుగులు నడిచిన సిద్ధు.. నాలుగేళ్ల కాపురం తర్వాత తన భార్యతో విడిపోయాడు. అనంతరం పలువురు హీరోయిన్లతో సిద్ధు డేటింగ్ చేసినట్లు రూమర్స్ వున్నాయి. కాకపోతే ఏ రిలేషన్ షిప్ కూడా పెళ్ళి వరకూ వెళ్ళలేదు. ఎట్టకేలకు ఇప్పుడు నటి అదితి రావు హైదరీతో జీవితాన్ని పంచుకోడానికి రెడీ అయ్యారు. మరి వీరిద్దరూ త్వరలోనే పెళ్లి డేట్ కూడా అనౌన్స్ చేస్తారేమో వేచి చూడాలి.