Begin typing your search above and press return to search.

ప్రతినిధి-2 ట్రైలర్.. హీటేక్కిస్తున్న పొలిటికల్ డైలాగ్స్

"మన స్వాతంత్ర్యం కోసం పోరాడిన గాంధీజీ చనిపోయినప్పుడు ఎంతమంది సూసైడ్ చేసుకున్నారు? ఎంత మంది గుండెపోటుతో చనిపోయారు?"

By:  Tupaki Desk   |   19 April 2024 2:09 PM GMT
ప్రతినిధి-2 ట్రైలర్.. హీటేక్కిస్తున్న పొలిటికల్ డైలాగ్స్
X

టాలెంటెడ్ హీరో నారా రోహిత్.. కొన్నేళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. పదేళ్ల క్రితం వచ్చిన ప్రతినిధి మూవీ సీక్వెల్ లో ప్రస్తుతం ఆయన నటిస్తున్నారు. ఈ సినిమాతో ప్రముఖ జర్నలిస్ట్ మూర్తి దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. ఇప్పటికే ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రతినిధి 2 కాన్సెప్ట్ పోస్టర్ నుంచి ఈ సినిమా నుంచి విడుదలైన ప్రతి అప్డేట్ కూడా ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది.

ఇటీవల విడుదలైన టీజర్ అయితే చెప్పక్కర్లేదు. నారా రోహిత్ తన ఇంటెన్స్ యాక్టింగ్ తో అదరగొట్టేశారు. "ఇప్పటికైనా ఒళ్ళు విరిచి బయటకొచ్చి ఓటేయండి. లేదంటే ఈ దేశం వదిలి వెళ్లిపోండి. అది కూడా కుదరకపోతే చచ్చిపోండి" అంటూ ఆయన చెప్పిన డైలాగ్ అదిరిపోయింది. కొన్ని రోజుల పాటు ఫుల్ ట్రెండ్ అయింది. వేసవి కానుకగా ఏప్రిల్ 25వ తేదీ విడుదల కానున్న ఈ సినిమా ట్రైలర్ ను రీసెంట్ గా రిలీజ్ చేశారు మేకర్స్.

"మన స్వాతంత్ర్యం కోసం పోరాడిన గాంధీజీ చనిపోయినప్పుడు ఎంతమంది సూసైడ్ చేసుకున్నారు? ఎంత మంది గుండెపోటుతో చనిపోయారు?" అంటూ ట్రైలర్ లో రోహిత్ వేసిన ప్రశ్న ఆలోచింపజేసేలా ఉంది. ఇలాంటి చాలా ప్రశ్నలు ఈ సినిమాలో ఉండబోతున్నట్లు అర్థమవుతుంది. ట్రైలర్ చివరలో "ఒక్కసారి ఎక్కి కూర్చున్నాడంటే ఐదేళ్లపాటు వాడు చెప్పిందే వినాలి.. డిసైడ్ చేసుకో" అని హీరో చెప్పిన డైలాగ్ ఎన్నికల హీట్ పెంచేలా కనిపిస్తోంది.

పథకాలు, అభివృద్ధి వంటి అనేక అంశాలను ఈ సినిమాలో మేకర్స్ చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ట్రైలర్ లో నిజాయితీ గల న్యూస్ రిపోర్టర్ పాత్రలో నారా రోహిత్ యాక్టింగ్ అద్భుతంగా ఉంది. నటీనటుల డైలాగ్స్, విజువల్స్, ఫైట్స్ తో పాటు మ్యూజిక్.. అలా అన్ని ఆకట్టుకుంటున్నాయని నెటిజన్లు చెబుతున్నారు. మొత్తానికి ప్రతినిధి 2 ట్రైలర్ మూవీ పై ఇప్పటివరకు ఉన్న అంచనాలను మరింతగా పెంచేసిందని అంటున్నారు.

ఈ సినిమాను కుమార్ రాజా బత్తుల, ఆంజనేయులు శ్రీ తోట, సురేంద్రనాథ్ బొల్లినేని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ మహతి స్వర సాగర్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఫస్ట్ పార్ట్ రిలీజైన రోజే.. సీక్వెల్ కూడా రిలీజ్ అవుతుండడం గమనార్హం. హీరోయిన్ గా సిరి లెల్లా నటిస్తుండగా.. ఇంద్రజ, తనికెళ్ల భరణి, ఉదయభాను, అజయ్ ఘోష్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మరి ఈ సినిమాతో నారా రోహిత్ ఎలాంటి హిట్ అందుకుంటారో చూడాలి.