Begin typing your search above and press return to search.

పరువు నష్టానికి ట్వీట్ శిక్ష

By:  Tupaki Desk   |   7 Aug 2015 9:52 AM GMT
పరువు నష్టానికి ట్వీట్ శిక్ష
X
టెక్నాలజీ చేతికి వచ్చిన తర్వాత ప్రైవసీ అన్నది పూర్తిగా అడుగంటిపోయిన పరిస్థితి. మన మానాన మనం ఉన్నా.. ఎదుటోడికి మనం నచ్చకుంటే.. రచ్చ చేయాలంటే పెద్ద టైం పట్టని పరిస్థితి. ఇది సామాన్యలకే కాదు.. సెల్రబిటీలకు.. రాజకీయ నాయకులకు ఇదే పరిస్థితి.

వ్యక్తిగత అగ్రహం హద్దులు దాటి.. ఎదుటివారిని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఈ మధ్య కాలంలో తరచూ ఎదురవుతోంది. ఇలా తమ పరువునకు భంగం వాటిల్లేలా చేస్తున్న ఒక వ్యక్తిపై ఇద్దరు రాజకీయ నాయకులు న్యాయపోరాటం చేయటం ఒక ఎత్తు అయితే.. దానికి సదరు జడ్జి విధించిన శిక్ష ఇప్పుడు అందరి దృష్టిని విపరీతంగా ఆకర్షిస్తోంది.

ఫ్రాన్స్ లో చోటు చేసుకున్న ఈ ఉదంతం ఇప్పుడు అందరూ చర్చించుకునేలా చేయటమే కాదు.. ఎంత జాగ్రత్తగా ఉండాలన్న విషయాన్ని చెప్పకనే చెప్పేస్తుంది. ఫ్రాన్స్ కు చెందిన ఫ్లుజిన్ బాప్టిస్టే అనే అతను.. ఇద్దరు రాజకీయ నాయకుల్ని ఉద్దేశించి ట్విట్టర్ లో వారిపై ట్వీట్స్ చేశారు. అతగాడు చేసిన ట్వీట్ తో తమ పరువునకు భంగం వాటిల్లిందని పేర్కొంటూ ఇద్దరు రాజకీయ నాయకులు కోర్టును ఆశ్రయించారు.

ఈ క్రమంలో ఫ్లుజిన్ బాప్టిస్టే చేసిన ట్వీట్స్.. సదరు రాజకీయ నేతల పరువుకు భంగం వాటిల్లేలా చేశాయని కోర్టు నిర్ధారించింది. దీనికి శిక్షగా.. కాస్తంత డిఫరెంట్ తీర్పును ఇచ్చారు. తన ట్వీట్స్ తో అవమానించిన రాజకీయ నాయకులకు పరువు నష్టం కింద ఒక యూరోను.. కోర్టు ఖర్చుల కింద 5 వేల యూరోలను చెల్లించాలని తీర్పు ఇచ్చారు.

అంతేకాదు.. ఏ ట్వీట్ కారణంగా వారు పరువు నష్టం వాటిల్లిందని భావించారో.. అదే తీరులో 466 ట్వీట్స్ ఇవ్వాలని.. అందులో సదరు రాజకీయ నాయకులకు క్షమాపణలు తెలపాలని కోర్టు పేర్కొంది. తీర్పు ఇక్కడితో అయిపోలేదు.. ఈ 466 ట్వీట్స్ ను 30 రోజుల వ్యవధిలో పూర్తి చేయాలని షరతు పెట్టింది కూడా. అంతేకాదు.. కోర్టు ఇచ్చిన తీర్పును 30 రోజుల వ్యవధిలో అమలు చేయని పక్షంలో ప్రతి ట్వీట్ కు 100 యూరోల చొప్పున జరిమానా కట్టాల్సి ఉంటుందన్న మాటను కూడా తీర్పుగా చెప్పిందట. మొత్తానికి ట్వీట్స్ పరువు నష్టానికి గురి చేస్తే.. అవే ట్వీట్స్ తో పోయిన పరువు వచ్చేలా కోర్టు కాస్తంత చిత్రమైన తీర్పే ఇచ్చింది కదూ.