Begin typing your search above and press return to search.

ఎన్నికల ఫలితాలపై జగన్ సంచలన వ్యాఖ్యలు.. పీకేకి చురకలు!

ఈ రోజు మధ్యాహ్నం "ఐ ప్యాక్" ప్రతినిధులతో సీఎం జగన్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. విజయవాడలోని బెంజ్ సర్కిల్ ‎లో ఉన్న ఆ ఆఫీస్ కు చేరుకుని, ఆ టీంను కలిసి కృతజ్ఙతలు చెప్పారు.

By:  Tupaki Desk   |   16 May 2024 8:53 AM GMT
ఎన్నికల ఫలితాలపై జగన్  సంచలన వ్యాఖ్యలు.. పీకేకి చురకలు!
X

ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది.. వీటికి సంబంధించిన ఫలితాలు జూన్ 4న రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఈ ఎన్నికల ఫలితాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా... 2019 ఎన్నికల్లో వచ్చిన సీట్లకంటే ఎక్కువ స్థానాల్లో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జగన్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

అవును... జూన్ 4న రానున్న ఎన్నికల ఫలితాలపై తీవ్ర ఉత్కంట నెలకొన్న సంగతి తెలిసిందే. ఏపీలో ఏ ఇద్దరు వ్యక్తులు కలిసినా రానున్న ఎన్నికల ఫలితాలపై కచ్చితంగా మాట్లాడుకుంటున్నారని చెప్పినా అతిశయోక్తి కాదు. ఈ సమయంలో తాజాగా ఏపీ సీఎం వైఎస్ జగన్ స్పందించారు. ఇందులో భాగంగా... ఏపీలో మరోసారి అధికారంలోకి వస్తున్నామని.. గతంలో కంటే కూడా ఎక్కువ సీట్లు వస్తాయని అన్నారు.

ఈ రోజు మధ్యాహ్నం "ఐ ప్యాక్" ప్రతినిధులతో సీఎం జగన్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. విజయవాడలోని బెంజ్ సర్కిల్ ‎లో ఉన్న ఆ ఆఫీస్ కు చేరుకుని, ఆ టీంను కలిసి కృతజ్ఙతలు చెప్పారు. సీఎం జగన్ రాక నేపథ్యంలో ఐ ప్యాక్ టీం సభ్యులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఏపీ ఎన్నికల్లో తన పార్టీ కోసం పనిచేసినందుకు ఐ ప్యాక్ టీం ప్రతినిధులను సీఎం జగన్ అభినందించారు!

ఈ సందర్భంగానే స్పందించిన ఆయన... "మళ్లీ అధికారంలోకి వస్తున్నాం.. మరోసారి చరిత్ర సృష్టించబోతున్నాం. 2019లో 151 సీట్లు, 22 ఎంపీ సీట్లు గెలిచాం. ఈసారి గతంలో కంటే ఎక్కువే గెలుస్తాం. ఏపీలో వైసీపీ ప్రభంజనం సృష్టించబోతోంది. జూన్‌ 4వ తేదీన రాబోయే ఏపీ ఫలితాలు చూసి దేశం షాక్‌ అవుతుంది. ఫలితాల తర్వాత దేశం మొత్తం మనవైపే చూస్తుంది" అని సంచలన వ్యాఖ్యలు చేశారు.

ప్రశాంత్ కిశోర్ ప్రస్థావన!:

గతకొన్ని రోజులుగా చంద్రబాబుకు మరో స్వపక్షంగా మారారనే పేరు సంపాదించుకున్న ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ పైనా జగన్ స్పందించారు. ఇటీవల కాలంలోని పలు ఇంటర్వ్యూలో... రానున్న ఎన్నికల్లో ఏపీలో వైసీపీ అధికారంలోకి రాదంటూ పీకే చేస్తున్న వ్యాఖ్యల నేపథ్యంలో అన్నట్లుగా స్పందించిన జగన్... ప్రశాంత్ కిశోర్ ఆలోచించలేనన్ని సీట్లు ఈసారి వైసీపీకి వస్తాయని అన్నారు.

ఈ క్రమంలోనే వచ్చే ప్రభుత్వంలో ప్రజలకు ఇంకా ఎక్కువ మేలు చేద్దామని చెప్పిన జగన్... రానున్న రోజుల్లో ఈ ప్రయాణం ఇలాగే కొనసాగుతుందని ఐ ప్యాక్ సభ్యులతో చెప్పారు.

ఇలా పోలింగ్ డే తర్వాత తొలిసారిగా జగన్ బయటకు వచ్చి.. ఐ ప్యాక్ ఆఫీస్ లో చాలా సంతోషంగా కనిపించడం.. గతంలోకంటే మరింత మెరుగైన ఫలితాలు సాధిస్తామని చెప్పడం.. ఈ గ్యాప్ లో పీకేకీ చురకలంటించినంత పనిచేయడంతో వైసీపీ శ్రేణుల్లో గెలుపుపై ధీమా మరింత పెరిగిందని అంటున్నారు పరిశీలకులు.