Begin typing your search above and press return to search.

అఖిల ప్రియ బాడీగార్డ్‎ పై దాడి.. తెరపైకి 'యువగళం' నాటి ఘటన!

ఈ సమయంలో నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో మరోసారి ఫ్యాక్షన్ విజృంభించింది! అఖిల ప్రియ బాడీ గార్డ్ పై దాడి జరిగింది!

By:  Tupaki Desk   |   15 May 2024 12:53 PM GMT
అఖిల ప్రియ బాడీగార్డ్‎ పై దాడి.. తెరపైకి యువగళం నాటి ఘటన!
X

ఏపీలో ఎన్నికల పోలింగ్ వేళ మొదలైన రచ్చ ఏమాత్రం సద్దుమణగడం లేదు. ఒక వర్గం నేతలు కావాలనే ఈ తరహా ఘటనలకు పాల్పడుతున్నారని.. ఇటీవల జరిగిన దాడులే అందుకు ఉదాహరణలు అని.. ఎన్నికల సమయంలో వారి ఫ్రస్ట్రేషన్ అలా తీర్చుకుంటున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ సమయంలో నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో మరోసారి ఫ్యాక్షన్ విజృంభించింది! అఖిల ప్రియ బాడీ గార్డ్ పై దాడి జరిగింది!

అవును... మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ బాడీగార్డ్ నిఖిల్ పై హత్యాయత్నం జరిగిందని తెలుస్తుంది. ఏపీలో సోమవారం సార్వత్రిక ఎన్నికలకు పోలింగ్ జరిగిన నేపథ్యంలో నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో పలు చెదురుమొదురు సంఘటనలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పోలింగ్ పూర్తయిన తర్వాత ఏవీ సుబ్బారెడ్డి అనుచరులు భూమ అఖిలప్రియ బాడీగార్డ్ ‎పై దాడికి పాల్పడినట్లు చెబుతున్నారు.

ఈ మేరకు తాజాగా వెలుగులోకి వచ్చిన దృశ్యాల్లో... ఒక వాహనం వేగంగా వచ్చి నిఖిల్ పైకి దూసుకెళ్లినట్లు కనిపిస్తోంది. అనంతరం ఆ వాహనం నుంచి ముగ్గురు వ్యక్తులు దిగి దాడికి ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో... ఈ వాహనం ఎవరిది, అందులో వచ్చిన వ్యక్తులు ఎవరికి సంబంధించిన వారు అనే దానిపై స్పష్టత రావాల్సి ఉందని అంటున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

అయితే... గతంలో నంద్యాలలో నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రలో ఏవీ సుబ్బారెడ్డిపై మాజీ మంత్రి అఖిలప్రియ బాడీగార్డ్ దాడికి పాల్పడ్డాడు! దీంతో.. దీనిని మనసులో పెట్టుకునే ప్రస్తుతం ఈదాడికి పాల్పడినట్లు అఖిలప్రియ వర్గీయులు చర్చించుకుంటున్నారు. అయితే ఈ వ్యవహారంపై ఏవీ సుబ్బారెడ్డి ఇంకా స్పందించలేదు. ప్రస్తుతం గాయపడిన బాడీగార్డును నంద్యాల ప్రభుత్వ అసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారని తెలుస్తుంది.

ఇక దాడి, చికిత్స అనంతరం మాట్లాడిన బాడీగార్డ్ నిఖిల్ రెడ్డి... తనపై దాడి చేసింది ఏవీ సుబ్బారెడ్డి, భూమా కిశోర్ రెడ్డి మనుషులే అని చెబుతున్నారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు.. భూమా అఖిల ప్రియా, ఏవీ సుబ్బారెడ్డి ఇంటి వద్ద భారీగా మోహరించారు. అఖిల ప్రియ బాడీగార్డ్‌ పై దాడి నేపథ్యంలో ఆళ్లగడ్డలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది.